చంద్రబాబు పేషీలోకి మరో కీలక ఐఏఎస్!

  • యూపీ కేడర్ ఐఏఎస్ ఏవీ రాజమౌళిని డిప్యుటేషన్‌పై పంపేందుకు కేంద్రం సమ్మతి
  • సీఎం పేషీలో సేవలందించనున్న రాజమౌళి
  • 2014-19 మధ్య చంద్రబాబు పేషీలో సేవలందించిన రాజమౌళి
  • రాజమౌళి రాకతో నాలుగుకు చేరనున్న సీఎం పేషీ ఐఏఎస్‌ల సంఖ్య
ఏపీ సీఎం చంద్రబాబు పేషీలోకి మరో కీలక ఐఏఎస్ రాబోతున్నారు. యూపీ కేడర్‌కు చెందిన ఐఏఎస్ ఏవీ రాజమౌళి సోమవారం రిపోర్టు చేయనున్నారు. ఆయన డిప్యుటేషన్‌కు అపాయింట్‌మెంట్స్ కమిటీ ఇప్పటికే సమ్మతించింది. రాబోయే మూడేళ్ల పాటు ఏపీలో పనిచేసేందుకు అనుమతించింది. 

కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏవీ రాజమౌళిని తమకు కేటాయించాలంటూ డీఓపీటీకి, యూపీ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. దీంతో, కేంద్రం ఆయన్ను డిప్యుటేషన్‌పై పంపించేందుకు అంగీకరించింది. 

2003 బ్యాచ్‌కు చెందిన రాజమౌళి, గత టీడీపీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో డిప్యుటేషన్‌పై పనిచేశారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితంగా ఉండే ఆయన సీఎంఓ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఇప్పుడు కూడా ఆయన సీఎంవోలోనే విధులు నిర్వర్తించనున్నారు. ఆయన రాకతో సీఎంవో అధికారుల సంఖ్య నాలుగుకు పెరిగింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర, సీఎం కార్యదర్శిగా ప్రద్యుమ్న, అదనపు కార్యదర్శిగా కార్తికేయ మిశ్రా విధులు నిర్వర్తిస్తున్నారు. నాలుగో అధికారిగా రాజమౌళి విధుల్లో చేరనున్నారు. 

ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వినతి మేరకు ఏపీకి కృష్ణతేజకు కూడా దాదాపు లైన్ క్లియర్ అయ్యింది. కేరళ ప్రభుత్వం ఆయనను రిలీవ్ చేసేందుకు ఆమోదం తెలిపింది. కేంద్రం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ మేరకు సోమవారం అపాయింట్‌మెంట్స్ కమిటీ ఆమోదించనుంది. కృష్ణ తేజ బుధ, గురువారాల్లో  ఏపీలో రిపోర్టు చేయనున్నారు. ఆయన పవన్ కల్యాణ్ శాఖల్లో కీలక అధికారిగా కొనసాగే అవకాశం ఉంది.


IAS Rajamouli
CMO
Andhra Pradesh
Chandrababu
Pawan Kalyan

More Telugu News